క్రీ.శ. ౩౦౦ వరకు, అనగా శాతవాహనరాజ్యం చివరిరోజుల వరకు, వృత్తుల ప్రస్తావనే తప్ప కులం ప్రస్తావన దాదాపు లేదు. ధాన్యకటక బౌద్దస్తూపానికి ‘విధిక’ పేరుగల చెప్పులు కుట్టే వ్యక్తి కానుకలు సమర్పించినట్లు శాసనాధారం ఉంది. ఇతని తండ్రి ఉపాధ్యాయ. (బౌద్ద భిక్షువుకు ఒక పేరు) వీరిద్దరూ బౌద్ధులు. వైదిక, బౌద్దమతాలు పక్కపక్కనే సాగిన కాలమది. వారు వైదిక మతానుయాయులు.
౩వ శతాబ్ది మధ్యనుంచి ఆంధ్రదేశంలో ఆర్ధిక విప్లవం ఒకటి మొదలైంది. విదేశీ వ్యాపారం దాదాపు అంతమైంది. (రోమన్ సామ్రాజ్యం పతనం ఇందుకు ముఖ్యకారణం) పరిశ్రమలు మూలపడ్డాయి. ఇక్ష్యాకుల రాజధాని విజయపురిలో సైతం ఆనాటి పారిశ్రామిక అవశేషాలు కనపడవు. వ్యవసాయం వైపు దృష్టి మళ్ళింది. వాశిష్ట్టిపుత్ర చాంతమూల అను ఇక్ష్వకురాజు వేలాది నాగళ్ళను, పశువులను రైతులకు దానంచేసినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఆ పిమ్మట కృష్ణానదికి దిగువన ఉన్న పల్నాడు, వెలనాడు ప్రాంతం అంత కంచి పల్లవరాజుల పాలనకు లోనైంది. వారి పేరుతోనే పలనాడు అనే పేరు వచ్చింది. (పల్లవనాడు అని మొదటిపేరు) ఆ రాజులలో ఒకరు ‘కడువెట్టి’ అనే బిరుడుకలవాడు. ‘కడువెట్టి’ అనగా అడవులను నరికివేసినవాడు అని అర్థం. వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు అని స్పష్టమవుతుంది.
చేతివృత్తులు, వ్యాపారం సన్నగిల్లటంతో మారకం అవసరం తగ్గిపాయింది. ఏ గ్రామానికి ఆ గ్రామం ఏకాంతవాసం చేసే తత్వం ఆరంభంమైంది. లోహ పరిశ్రమ మూతపడ్డది. ఇక్ష్వాకు రాజులు రాగి నాణేలు విడుదల చేశారు. ఆ తర్వాత రెండు శతాబ్దాలకు (5-6 శతాబ్దాలు) కోస్తా జిల్లాలను పరిపాలించిన విష్ణుకుండిన రాజులు, రాగి లభించక ఇనుప నాణేలు జారిచేశారు. బౌద్ధం వెనుకపడింది. భక్తి ప్రధానమైన భాగవత దొరనితో కూడిన వైదికమతం లేక బ్రాహ్మణ మతం పైచేయి సంపాదించింది (బ్రాహ్మణ మతం అంటే బ్రాహ్మణులకే పరిమితమైనదని కాదు. వారి ఆచార్యత్వంలోవిస్తరించిన వైదికమతం అని అర్థం. చాతుర్వర్ణ వ్యవస్థ ఇందులోని ముఖ్యంశము).
పల్లవరాజులు గాఢ బ్రాహ్మణ మతాభిమానులు. కృష్ణకు దిగువ జిల్లాల్లో ఈ రాజులు పెద్ద ఎత్తున దేవాలయాలు నిర్మించారు. ( వానిలో కొన్ని ఈనాటికి ఉన్నాయి. చేబ్రోలు అలంటి వాటిలో ఒకటి) బ్రహ్మదేయం, దేవభోగం పేర్లతో బ్రాహ్మణులకు అగ్రహారాలు, దేవాలయాలకు భూములు ఇవ్వటం కూడా అప్పుడే మొదలయింది. వెలనాడు అంతటా ఇలాంటి దానదర్మలతో నిండి ఉంది. ప్రస్తుతం తెనాలి, రేపల్లె, బాపట్ల తాలూకాలను వెలనాడు అనేవారు. అంతవరకు వేరు వేరు వృత్తులు చేసే వారందరూ ఈ బ్రాహ్మణాగ్రహారాలలో వ్యవసాయదారులుగా స్థిరపడసాగారు. వీరందరికీ ఆనాటినుంచీ శూద్రులు అనే పేరు వాడుకలోకి వచ్చింది. వీరే నాలుగో వర్ణం.
ఈ కాలంలో బ్రాహ్మణులూ పౌర, సైనిక వృత్తులు కూడా స్వికరించేవారు. ఇక్ష్వాకుల ఆస్థానంలో ‘భోదిసిరి’ ‘భద్రబోదిశర్మ’ అనే బ్రాహ్మణులు కోశాదికారులుగా ఉండేవారు (బౌద్దమత చిహ్నమైన బోధి బ్రాహ్మణమత చిహ్నమైన శర్మ కలిసి ఈ పేర్లు ఏర్పడిన విషయం గమనిచాలి).
అభీర రాజు ఆస్థానంలో (అభిరులు పశ్చిమ తెలంగాణా ప్రాంతంలోని స్థానిక పాలకులు) భరద్వాజ గోత్రానికి చెందిన శివశర్మ ‘మహాశ్రామిక’, ‘మహాతలవారి’, ‘మహాదండనాయక’ బిరుదు ధరించి విజయపురిపై దండెత్తిన సేనలకు నాయకత్వం వహించాడు. ఇదే గోత్రానికి చెందిన తిష్యశర్మ, మంత్రిగా ఉండేవాడు. ధర్మశర్మ, ఆర్యభూతి, అని మరికొందరి పేర్లుకూడా కనిపిస్తాయి. ధర్మశర్మ యుద్దంలో చనిపోగా అతని స్మృత్యర్థం ‘ఛాయస్తుపం’(సమాధిస్తుపం) నిర్మించబడ్డది. బ్రాహ్మణులు ౩ వృత్తులలోకి విభజితులైనారు. ఒకటి వైదిక పండితులు, రెండు దేవాలయ పూజారులు, మూడు ప్రభుత్వోద్యోగులు.
సామాజిక ఊర్ద్వ చలనం :
క్రీ.శ. 250, 500 మధ్య కృష్ణకు ఎగువ భాగాన విష్ణుకుండినులు పరిపాలించారు. వీరు దేవాలయ నిర్మాణం కంటే మౌలికమైన యజ్ఞయాగాదులు నిర్వహించాసాగారు (యజ్ఞాలు వైదికకర్మలకు, దేవాలయ నిర్మాణం భాగవత భక్తి ధోరణికి చిహ్నాలు). వీరి రాజధాని నగరాలు విజయవాడ, నల్గొండ జిల్లాలోని ఇంద్రపాలనగరం. వీరు తొలుత ఆటవిక తెగల వారై ఉండి, సంసృతీకరణ క్రమంలో వైదికులరాజులై క్షత్రియ చిహ్నమైన ‘వర్మ’ బిరుదు ధరించారు. సామాజిక ఆరోహనక్రమానికి బ్రాహ్మణత్వంచే ఆమోదం పొందేందుకుగాను, యజ్ఞయాగాలు విపరీతంగా చేశారు. ఈ రాజులలో మాధవవర్మ నరమేథం కూడా చేశాడని చెప్తారు. వీరింతిపేరు పూసపాటి. విజయనగరం పాలకులైన పుసపాటివారు మాధవవర్మను తమ వంశాకర్తగా చెప్పుకుంటారు. తెగలకు చెందినవారిని వర్ణవ్యవస్థలో భాగంగా చేసేందుకు ‘వ్రాత్యస్తోమం’, ‘హిరణ్యగోగర్భవ్రతం’ లాంటి కర్మకాండలు అప్పటికే రూపొందాయి. వైదిక బ్రాహ్మణులకు ఈ వ్రతాలద్వారా విస్తారంగా దానధర్మాలు చేసి అగ్రహారాలు ఇవ్వటం, వారు వీరికి క్షత్రియత్వం ఇచ్చి ద్విజులుగా గుర్తించటం అనాదిగా వస్తున్న ఆచారం. విష్ణుకుండినులేకాదు ఆ తర్వాత ఆంధ్రలో రాచరికం నిర్వహించిన వారందరూ ఇలాంటి క్షత్రియులే.
ఆటవిక తేగలవారందరూ మొదట బౌద్ధం స్వీకరించారు. ఒకటి రెండు తరలవరకు సాత్విక సంస్కారం పొందారు. పిమ్మట వర్ణవ్యవస్థలో పై స్థాయికి చేరుకున్నారు. ఆటవిక తెగల సంసృతీకరణకు మొదట్లో బౌద్ధం, తర్వాత జైనం నిచ్చేనమేట్ట్లుగా ఉపకరించాయి.
ఈ విదంగా సంసృతీకరణ పొందిన వారు కొందరు బ్రాహ్మణత్వం కూడా సాధించారు. కొండముది శాసనాలలో గోగిరాజు, మైదవోలు శాసనంలో గోనమద్విజ, పికిరో శాసనంలో విలశర్మ వీరంతా ఆటవిక తేగాలనుంది బ్రాహ్మణత్వం పొందిన వారని స్పష్టపడుతుంది. వీరందరికీ గోత్రం కశ్యప గోత్రం సంకీర్ణనతో ద్వారా బ్రాహ్మణత్వం పొందిన వారి కొరకు ప్రత్యేకంగా ఏర్పరిచిన గోత్రం ఇది. కొందరు బ్రాహ్మణులు తమ పేర్ల చివరలో ‘శర్మ’, ‘ఆర్య’ అను రెండుపదాలు చేర్చుకున్నారు. భావశర్మార్య, భట్టి శర్మార్య పేర్లు అందుకు నిదర్శనాలు. తమ బ్రాహ్మణత్వాన్ని ఎవరు ప్రశ్నిచకుండా దృడమైన సాక్షాధారాలు ఏర్పరుచుకున్నారు.
దక్షిణాది బ్రహ్మణులందరూ దాదాపు ఈవిధంగా ద్రావిడ ఆటవిక పునాదులనుంచి పైకి ఎగబ్రకినవారే. వీరంతా ఉత్తరాదినుంచి వచ్చిన బ్రాహ్మణులు అనుకోవటం పొరపాటు. తోలిరోజులలో కొందరు అలా వచ్చినమాట నిజమే. వారు సైతం ఉత్తరాదిన క్రింది శ్రేణి నుండి పైకి ఎగబ్రకినవారే. వేదకాలం నుండి నేటివరకు ఏ వర్ణమూ అవిచిన్నంగా లేదు. ప్రతీదీ సంకర వర్ణమే. ఈ వాస్తవాన్ని అంగీకరించటానికి, తెచ్చిపెట్టుకున్న ఆధిక్యతా భావం ప్రతి వర్ణానికి, కులానికి అడ్డువస్తున్నది. వర్ణ వ్యవస్థలోని మౌలికమైన విశాబీజం ఇదే.
వేంగీ చాళుక్యులు:
కోస్తా జిల్లాల్లో వేంగీ చాళుక్య రాజ్యం ఏర్పడటంతో నిజమైన మద్యయుగాలు ఆరంభమైనాయి. (క్రీ.శ. 600-1000) పశ్చిమ చాళుక్యుల సేనానులుగా వచ్చి కోస్తా జిల్లాలను ఆక్రమించుకొని తూర్పు చాళుక్యులు లేక వేంగీ చాళుక్యులు అని ప్రసిద్ది చెందారు. వీరు మొదట్లో జైనులు. పిమ్మట శైవులైనారు. మొదట వీరి భాష కన్నడం. పిమ్మట తెలుగే తమ మాతృభాషగా భావించారు. ఆవిధంగా వీరు తెలుగు భాషకు గొప్ప సేవచేశారు.
మొదటి తెలుగు శాసనం, తెలంగానలోనుకాక, కోస్తా జిల్లాలలో కాక రేనాటి సీమ అయిన కడప జిల్లాలో లభించింది. ఆర్ధిక విధానంలో వ్యవసాయం అతి ప్రధానస్థానం ఆక్రమించి స్వయం సంపూర్ణ గ్రామవ్యవస్థ రూపొందసాగింది. రాజులమద్య నిరంతర యుద్దాలు నిత్యకృత్యమైనాయి. పరిపాలన యంత్రాంగమంతా సైనికావసరాల దృష్ట్యా రూపాంతరం చెందింది. మతం కొన్ని మూడాచారాల పట్టింపుగా మారిపోయింది. భాష, విద్య, శిల్పం, అంతా మతంతో గాడంగా పెనవేసుకుపాయింది. ఈ కాలంలోనే దాదాపు కోస్తా జిల్లాలోని ఆటవిక తెగలందరూ వర్ణవ్యవస్థలో ఎదో ఒకచోట తలదూర్చారు. సంసృతీకరణ, సామాజిక ఆరోహణ నిరాఘాటంగా సాగిపాయింది. వృత్తి విభజన మతంతో శాఖభేదాలు విస్తరించాయి.
అగ్రహారాల సంఖ్యా విపరీతంగా పెరిగింది. కర్మ రాష్ట్రంలో ఆలుగురాజు, అటవీ దుర్జయ మొదలైనవరందరూ స్తానిక పాలకులు. కర్మ రాష్ట్రం అంటే కృష్ణకు దిగువన ఉన్న నరసరావుపేట, గుంటూరు, సత్తెనపల్లి, వినుకొండ, పల్నాడు ప్రాంతం. క్రమంగా ఈ మాట కమ్మనాడుగా మారిపాయింది. అలుగురాజు వంశస్తుడే పల్నాటి యుద్దంలో కీలకస్థానం వహించిన నలగామరాజు.
వేంగీ చాళుక్యులలో మొదటివాడు కుబ్జ విష్ణువర్ధనుడు. (ఇతనికి కొంచెం గూని ఉండేది. కనుక కుబ్జ అనే విశేషణం వచ్చింది) ఇతడు, ఇతని వంశస్థులు కంచి పల్లవులతో నిరంతరం యుద్దాలు చేయవలసి వచ్చింది. వేంగీ దేశానికి(ఏలూరు ప్రాంతం, గోదావరి, కృష్ణా, మద్యస్థ ప్రాంతం అంతా వేంగీ మండలం) కంచికి మద్య నెల్లూరు ప్రాంతంలో బోయలు రాజ్యం చేస్తుండేవారు. వీరు భయంకరమైన ఆటవిక పోరాట యోధులు. నాలుగు శతాబ్దాల క్రమంలో వీరు చాళుక్య రాజులచే ఓటమిచెంది వైదికమతం స్వీకరించి వర్ణవ్యవస్థలో భాగస్తులైనారు. బ్రాహ్మణ, వైశ్య, శూద్ర వర్ణాలు మూడింటిలోనూ వీరు చేరిపోయారు. ఈ కాలంలోనే బోయ బ్రాహ్మణులు అనే మాట ఏర్పడ్డది. క్రమంగా బోయ అనేమాట అంతరించి బ్రాహ్మణులు అనే మాటే మిగిలింది. ఇదేవిదంగా పశ్చిమ తెలంగాణ నుంచి రాష్ట్రకూటులు నిరతరం వేంగీ చాళుక్యులపై యుద్దాలు చేస్తుండేవారు. ఈ క్రమంలో వారు తెలంగాణలోని పులిందులు అను తెగవారిని వర్ణవ్యవస్థలో భాగస్వాములు చేశారు. సైనికదాడులు, సాంసృతిక సమన్వయం పక్క పక్క నే సాగిన కాలమిది. ఈవిధంగా ఆంధ్రదేశంలో పెక్కు తెగలు వైదికమతంలో భాగస్వాములైనారు. వీరిలో కొందరు (బోయలు, పులిందులు) సుటిగాను మరికొందరు జైనం అనే నిచ్చెన మేట్లద్వారాను వర్ణవ్యవస్థలో చేరిపోయారు. మొదట జైనులై తరువాత హిందువులైన వారిలో ముఖ్యులు కోమట్లు. కోమటి అనే పేరు గోమటేశ్వరుని ద్వార వచ్చింది. ఆనాడు మెదక్ జిల్లా బోధన్ లో బ్రహ్మాండమైన గోమటేశ్వర విగ్రహం ఉండేది. పిమ్మట అది ద్వంసం అయింది. దాని నమూనాలో నిర్మితమైన గోమటేశ్వర విగ్రహం ఇప్పటికి శ్రావణబెళగోలలో ఉంది. కోమట్లు మాత్రమేగాక చేతివృత్తులవారందరూ, కంసాలి, కమ్మరి, కంచరి, కాశే, వడ్రంగి వీరిని పంచాసనంవారు అంటారు. అంటే ఐదురకాల చేతివృత్తులు చేసేవారు. వీరంతా మొదట్లో జైనులు. పిమ్మట వర్ణవ్యవస్థలో భాగమై హెచ్చుమంది శైవులైనారు.
పెనుగొండులోని కన్యకగాథ, కన్యక అగ్నిగుండంలో దూకి ఆత్మార్పణ చేసుకోవడం అంత జైన సల్లెఖనాచారానికి దగ్గరగా ఉంది. రాజులే శైవులైతే ప్రజలు శైవులు కాక తప్పదు. ఈ క్రమంలో అనేక కులనామాలు ఏర్పడ్డాయి. సెట్టి, నాయుడు, నీడు, నాయక, రెడ్డి మొదలైనవి. ఈ మాటలన్నీ పల్నాటి చరిత్రలో ప్రస్తావించబడిన విషయం తెలిసిందే(బ్రహ్మనాయుడు, మల్నీడు).
మరొక పరిణామం జరిగింది. సేననాయకులకు, వీరులకు గ్రామాలు, గ్రామా సముదాయాలు దానం చేసే పద్ధతి మొదలైంది. ఆయుధోపజీవులకు సమాజంలో అగ్రస్థానం లభించింది. వీరు యుద్దసమయంలో సైనికులు, శాంతియుత పరిస్థితులలో రైతులు.
కమ్మ, వెలమ, రెడ్డి కులాలు:
ఈ చారిత్రక నేపథ్యంలోనే ఆంధ్రదేశంలో కమ్మ, వెలమ, రెడ్డి కులాలు రూపొంది ప్రముఖస్థానం వహించాసాగాయి.
వెలమలు అను పేరు వెలనాడు నుండి వచ్చింది(తెనాలి, రేపల్లె, బాపట్ల తాలూకాలు) ఆప్రాంతంలో వీరు రైతులుగా, భూస్వాములుగా, సాహసికులైన వీరులుగా రూపొందారు. దక్షిణాదిన అప్పటికే ప్రారంభమైన వైష్ణవ ఆళ్వారుల భక్తి ఉద్యమ ప్రభావం వీరిపై పడ్డది. వెలనాటి గొంకరాజు నాటి పాలకుడు. ఇలా ఉండగా కన్నడంలో మొదలైన వీరశైవ ఉద్యమం ప్రభావం కోస్తా జిల్లాలపై పడింది. గోదావరి జిల్లాలకు చెందిన మల్లికార్జున పండితారాధ్యుడు వెలనాడు వచ్చి బౌద్దులను ఓడించినట్లు చరిత్రలో ఋజువులున్నాయి. బౌద్ధులు పారిపోయారు. శైవం పైచేయి సాదించింది. శైవులు అవలంబించిన కుటిల పద్దతులతో వెలనాడు అంతా మతకలహాలు మొదలయినాయి. వ్యవసాయం మూలపడ్డది. అగ్రహారాలు పాడుపడ్డయి. ఈ కల్లోలాన్ని తట్టుకోలేక ఆయుధోపజీవులైన వెలమలంతా మూకుమ్మడిగా తెలంగాణకు తరలిపోయారు. దేవరకొండ, రాచకొండ లాంటి ప్రాంతాలకు పాలకులైనారు. బ్రాహ్మణులు కృష్ణను దాటి గోదావరిని దాటి తూర్పు ప్రాంతాలకు తరలి వెళ్లారు. వెలనాటి బ్రాహ్మణులు హెచ్చుగా తూర్పుగోదావరి జిల్లాలో ఉండటానికి అదే కారణం. వేంగీ చాళుక్యులు ఈ పరిణామానికి దోహదంచేసి ఈ బ్రాహ్మణులకు విస్తారంగా అగ్రహారాలు ఇచ్చారు. తొమ్మిదవ శతాబ్ది నుండి కోస్తా జిల్లాలో దేవాలయ నిర్మాణం తిరిగి పుంజుకుంది. చాళుక్య విజయాదిత్యుడు (క్రీ.శ.850) ఉభయ గోదావరి జిల్లాలలో 108 శివాలయాలు నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ద్రాక్షారామం,క్షీరారామం, అమరారామం, ఇత్యాది శైవ క్షేత్రాలన్నీ అలా రూపొందినవే. వీటిలో హేచ్చుభాగం అంతకుముందున్న బౌద్ద స్తూప శిథిలాలపై నిర్మించబడ్డయి. మత విద్వేషం ఆ స్థాయిలో ఉండేది.
జైనం ప్రజా మతం. జైన సారసత్వం హెచ్చుగా ఉండేది. అక్షరాలు చేక్కేవారందరూ జైనులైన విశ్వబ్రాహ్మణులు. అక్షరాభ్యాస సమయంలో ‘ఓం నమః శివాయ సిద్దం నమః’ లో సిద్దుడు జైన గురువు. శివాయ అనుమాట తరువాత చేరింది.
జైనమత ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సంసృత పురాణాలను తెలుగులో అనువదించే కృషి మొదలైంది. రాజరాజనరేంద్రుని ప్రోత్సాహంతో నన్నయ ఆంధ్ర మహాభారతా అవతరణ అలా జరిగింది. అంతకు ముందు ప్రజలు “గాసట బీసటే చదివి గాథలు తవ్వేవారని” నన్నయగారే చెప్పారు. జైన గాథలు, గ్రంథాలు ప్రచారంలో ఉండేవన్నమాట అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి.
పల్నాటియుద్దం ‘కులంపోరు’ అంటారు. కేవలం కులం పోరు కాదు. మతం పోరుకూడ. ఈ రెండు పేర్లతో సాగిన అధికారం కొరకు పోరు. అలుగురాజు వద్ద పెద్దినాయుడు, అతని కుమారుడు బ్రహ్మనాయుడు మంత్రులు. బ్రహ్మనాయుడిని మంత్రి పదవి నుండి తొలగించి నాగమ్మ మంత్రి అయింది. నాగమ్మ రెడ్డి వంశస్తురాలు. రెడ్డ్లు అప్పటికే వీర శైవంను అభిమానించారు. బ్రహ్మనాయుడు ‘వీరవైష్ణవం’ అభిమానించాడు. కులాలన్నిటినీ చెరిపి చాపకూడు, వర్ణానంతర వివాహాలు, హరిజన పూజారిత్వం ఏర్పరిచాడు. (మాచర్ల చెన్నకేశవ దేవాలయంలో హరిజనులు పూజారులు) ఈ తీవ్ర సంస్కరణలు శైవులకు ఇష్టం లేదు. శైవులు కూడా మొదట్లో బ్రాహ్మణ మతంపై తిరుగుబాటు చేసినవారే. కానీ ఒక చోట ఆగిపోయారు. బ్రహ్మనాయుడు ఇంకా ముందుకు వెళ్ళాడు. ఇవన్ని పల్నాటి యుద్దానికి కారణాలు. యుద్దంలో బ్రహ్మనాయుడు ఓడిపోయాడు. అతని అనుచరులంత వెలమకులంలో చేరిపోయారు. హెచ్చుమంది తెలంగాణకు వెళ్లి కాకతీయుల ఆశ్రయం పొందారు.
రెడ్డి అనేమాట ఎలా పుట్టిందనేది చెప్పటం కష్టం. అదొక గౌరవపదంగా అదికార దర్పానికి సూచకంగా ఆనతి నుండి వస్తున్నది. రాష్ట్ర కూటులు తెలుగు దేశం వచ్చి స్థిరపడి క్రమంగా రెడ్లుగా మారారని ఒక వాదన ఉంది.
కాకతీయుల కాలంలో గజసేనాధ్యక్షుడైన జాయపసేనాని కమ్మ కులానికి మూలపురుషుడు. కమ్మ అంటే లేఖ. కాకతీయుల వద్ద వారు లేఖకులుగా ఉండి క్రమంగా పాలకులైనందున వీరికా పేరు వచ్చినట్లు కొందరంటారు. ఒక కమ్మ ద్వారా జాయపసేనానికి గజసైన్యాదిపత్యం రావడంతో ఆ పేరు స్థిరపడి ఉండవచ్చు. వీరి రాజ్యం కృష్ణానది దక్షిణ తీరాన రేపల్లె తాలుకా ప్రాంతం. జాయపసేనాని వంశస్థులు క్రమంగా విస్తరించిన మీదట ఇదంతా కమ్మనాడు అనే పేరు వచ్చింది. ఆ ప్రాంతంలో నివసించిన బ్రాహ్మణులకు కమ్మనాటి బ్రాహ్మణులు, కమ్మ బ్రాహ్మణులు అనే పేర్లు కూడా కొంతకాలం వ్యాప్తిలో ఉండేవి.
ముస్లిం నవాబుల కాలంలో ఉత్తరాదినుండి కాయస్థులు వచ్చి ఎక్కువగా హైదరాబాదు లో స్థిరపడ్డారు. డీల్లి నవాబుల పాలన మొదలైనప్పటి నుండి వారి వద్ద లేఖఖ ఉద్యోగాలలో ప్రావీణ్యం సంపాదించి ఉన్నత పదవులు పొందిన వారు కాయస్థులు. బీహార్, బెంగాల్ రాష్ట్రాలలో నేటికి వీరి సంఖ్య హెచ్చు.
ఈ నాటికి మన సాంసృతిక జీవితాన్ని విషపూరితం చేస్తున్న వేయిపడగల విషసర్పమైన కులతత్వం పుట్టిన తీరు ఇది.
***పైన ఉన్న విషయాలు నేను కూడా సంగ్రహిచినవే కావున ఏమైనా తప్పులు ఉంటే దయచేసి comments లో తెలియ చేయగలరని నమ్ముతున్నాను*****
Comments
Post a Comment