Skip to main content

చిందు భాగవతులు

మాదిగ ఆశ్రిత కులాల్లో చిందు భాగవతులు ఒకరు. సమాజంలో సమాంతరంగా కులాలు ఉన్నాయి. బ్రాహ్మణుల నుంచి షెడ్యూల్డు కులాల వరకు పోషిత కులాలు, ఆశ్రిత కులాలు అనే విభజన ఉంది. మాదిగ కులానికి ఆరు ఆశ్రిత కులాలున్నాయి. అవి డొక్కలవారు, చిందు భాగవతులు, బైండ్లవారు, నులక చందయ్యలు, కిన్నెరవారు, మాష్టీలు. వీరు సంస్కృతీపరివాహకులు. వీరు నాట్యంలో, అభినయంలో, గాత్రంలో దిట్టలు. చిందు భాగవతాన్ని చిందు యక్షగానం అని కూడా పిలుస్తారు. లయబద్దంగా అడుగులు వెయ్యడాన్ని చిందు అంటారు. ఈ జానపద కళాకారులు తమ కళను ప్రదర్శించుకుంటూ ఊరూరా తిరుగుతూ తమ భుక్తిని గడుపుకుంటారు. తమ పోషకుల కులపురాణాలను, గోత్రాలను, వంశ వృక్షాలను, బిరుదులనూ వీరగాథల్లాగా గానం చేస్తూ ఉంటారు. చరిత్ర గర్భంలో మరుగున పడి ఉన్న వీరి జీవన విధానం మీ కోసం..
చిందు భాగవతులు మాదిగవారిని తప్ప వేరేవారిని ఆశించరు. జాంబపు రాణం వంటి కుల కథలను ప్రదర్శిస్తూ కులపురాణాలను వల్లెవేస్తూ మాదిగలకు వినోదాన్ని కలిగిస్తున్నారు. పల్లె ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ కళారూపాలు ప్రాచీనమైనవి. ఈ కళాకారులు ప్రజల నుంచి ఆశించేది పట్టెడన్నం, పాత వస్త్రాలు, భుక్తికి కాసిని కాసులు.
యక్షగానం లేక చిందుభాగవతం తెలంగాణలో విశిష్టమైన కళారూపం. ఆంధ్ర ప్రాంతంలోనూ అక్కడక్కడా కనిపిస్తుంది. చిందు భాగవతం మత సంబంధమైన ప్రక్రియగా మొదట తలెత్తింది. కాలక్రమేణా చిందు భాగవతులు రామాయణం, భారతం, భాగవతాల నుంచి కొన్ని కథలను తీసుకొని ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా వీళ్ళ ప్రదర్శనలకు కావాల్సిన విషయం లిఖితపూర్వక గ్రంథాల్లో లభ్యమవుతున్నా వాటికి కావాల్సిన మార్పులు, చేర్పులు చేసుకోవడంలో చిందు భాగవతుల ప్రతిభా పాటవాలు కనిపిస్తాయి.



ఎల్లమ్మ పాత్ర కీలకం:
చిందు భాగవతులు ప్రదర్శిస్తున్న నాటకాలు తాతల కాలం నాడు 75 ఉన్నా ప్రస్తుతం 50 మాత్రమే ప్రచారంలో ఉన్నాయి. చిందువారి పండగల్లోనూ, వివాహ సమయంలోనూ జాంబపురాణం చెప్పి తీరాలి. దాదాపు వారం రోజుల పాటు సాగే ఈ ప్రక్రియలో చిట్టచివరి ఘట్టం ఎల్లమ్మ వేషం. వీరి కుల దేవత ఎల్లమ్మ. చిందు భాగవతుల ప్రదర్శనలో ఎల్లమ్మ వేషం ముఖ్యమైనది. ఒక కుటుంబంలో అందమైన చిందువారి ఆడపడుచును ఎల్లమ్మ వేషం కోసం అవివాహితురాలిగా ఉంచేవారు. ఆమెను 'ఆదిపాప', 'జోగిత' అనే పేర్లతో పిలిచేవారు. ఆమెను పవిత్రురాలిగా భావిస్తారు. ఆమెకు వివాహంతో నిమిత్తం లేదు. అయినా లైంగిక స్వాతంత్య్రం ఉంటుంది. చిందు ప్రదర్శన తరువాత ఆమెను ఇంటింటికి భిక్షాటనకు పంపుతారు. 
సోడిగాడు :
వివిధ రకాల ఆభరణాలతో చిందు భాగవతుల వేష ధారణ కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. ప్రదర్శనలో మద్దెల, హార్మోనియం, తాళాలు ముఖ్యమైన వాయిద్యాలు. మద్దెలను వీరే తయారుచేసుకుంటారు. వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తూ కథ చెప్తారు. వీరి వచనాలు, పద్యాలు, పాటలు, హాస్యాలు, సామెతలు, పొడుపు కథలు ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్నిస్తాయి. ఈ వేషాల్లో సోడిగాడి వేషం చూడ ముచ్చటగా ఉంటుంది. 'సోడిగాడు వచ్చెరా, సోద్యమెల్ల వచ్చెరా' అంటూ హాస్యగానాలు చేస్తూ ఉంటారు. సినిమా ప్రభావం వల్ల ఈ సోడిగాడి రూపు రేఖల్లో, పాడే పాటల్లో ఇటీవలి కాలంలో మార్పు వచ్చింది. ప్రదర్శనను ప్రారంభించే ముందు ప్రదర్శనకు ఉపయోగించే పెట్టెను, వినాయకుడ్ని, సరస్వతిని ప్రార్థిస్తారు. ఒకప్పుడు అలంకరణకు సంబంధించిన రంగులను చెట్లు ఆకులు అలముల నుంచి వారే తయారు చేసుకునేవారు. ఇప్పుడు మార్కెట్‌లో దొరికే మేకప్‌ సామగ్రిని ఉపయోగిస్తున్నారు. ఆభరణాలు కూడా బూరుగు, పొనికి చెట్ల కర్రల నుంచి తయారు చేస్తారు. రంగులతోనూ, జరీ తోనూ వాటిని అందంగా అలంకరిస్తారు. వీరు ధరించే దుస్తుల్లో స్త్రీల చీరలనే పురుషులు పంచెలుగా ధరించడం పరిపాటి. ఒక్కొక్కప్పుడు ఏ ప్రత్యేక వస్త్రధారణ లేకుండా నాటకాల్లో పాల్గొంటారు. ఈ విధంగా పాల్గొనడానికి ఖర్చులు భరించే శక్తి లేకపోవడమే.
చిందుల బృందాలను మేళాలు అంటారు. గజవల్లి వెంకటనర్సు మేళం, ఉప్పల్‌లోని చిందు ఎల్లయ్య మేళం చాలా పేరున్న మేళాలు. పేరున్న మేళాల్లో దాదాపు 12 వరంగల్‌ జిల్లాలో ఉన్నాయి. చిందు భాగవతులు మాదిగల ఆచార సంప్రదాయాలనే పాటిస్తారు. అంటే పండగలు పబ్బాలు, కుల పంచాయితీలు, జరిమానాలు, ఓలి, మారుమనువులు, కట్టుబాట్లు, విశ్వాసాలు అన్నీ ఆ కులానికి సంబంధించినవే అనుసరిస్తారు. గడ్డం, పిన్నెంటి, మామిళ్ళ, రాచపూడి, రాశల వంశనామాలు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు.
వీరికి స్థిరాస్తులు ఉండటం అరుదు. ప్రదర్శనలిస్తూ సంచార జీవితం గడుపుతుంటారు. సమకాలీన సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని అద్భుతమైన ప్రదర్శనలివ్వడం చిందు భాగవతుల నైపుణ్యానికి ఒక తార్కాణంగా చెప్పవచ్చు. అందుకేనేమో చిందు భాగవత ప్రదర్శనలు ఇంకా మనగలుగుతున్నాయి.


Comments

Popular posts from this blog

‘మాదిగ’జాతి గొప్పదనం - జాగో

తెలుగు సాహిత్యానికి సుమారు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉంది. నన్నయ క్రీ.శ .11వ శతాబ్దంలో ఆంధ్ర మహా భారతాన్ని రాశాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న నన్నయ ఆంధ్ర మహా భారతాన్ని వర్ణా శ్రమ ధర్మ పరిరక్షణ కోసం రాశాడు ( ఆంధ్ర మహాభారతం-ఆది:1 - 6). వర్ణాశ్రమ ధర్మాలను పరిరక్షించటం నాటి పాలకుల విధి. ఆ వర్ణాశ్రమ ధర్మాలు హిందూ ధర్మాన్ని బోధించే మనుస్మృతి మొదలైన గ్రంథాలను అనుసరించి రూపొందినవి. అలాంటి వర్ణాశ్రమ ధర్మాల గురించి వివరించటంలో ప్రాచీన తెలుగు కవులు ‘మాదిగ’లను కూడా ‘శూద్రులు’గానే పరిగణించారు. బ్రాహ్మణ, క్షత్రియ ,వైశ్యులకు అసూయలేకుండా సేవచేయటమే శూద్రుల ధర్మమని మనుస్మృతి (1-91) స్పష్టం చేస్తుంది. ప్రధానంగా ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఆ భావజాలాన్ని విస్తరించే ప్రయత్నమే కనిపిస్తుంది. దీనికి భిన్నంగా ఆధునిక సాహిత్యం చాలా వరకూ మానవీయ కోణంతో మాదిగ జీవితాలను వర్ణించింది. కనుక, తెలుగు సాహిత్యంలోని మాదిగల గురించి పురాణ, ప్రాచీన, ఆధునిక విభాగాలుగా విభజించుకుని పరిశీలించటం జరుగుతుంది. ఆయా కాలాలలో వెలువడిన వివిధ సాహిత్య ప్రక్రియలలో మాదిగల జీవితమెలా ప్రతిఫలించిందో ఈవ్యాసంలో వివరించే ప్రయత్నం చేస్తాను....

ఆంధ్రదేశంలో కులాల పుట్టుక – పెరుగుదల

క్రీ.శ. ౩౦౦ వరకు, అనగా శాతవాహనరాజ్యం చివరిరోజుల వరకు, వృత్తుల ప్రస్తావనే తప్ప కులం ప్రస్తావన దాదాపు లేదు. ధాన్యకటక బౌద్దస్తూపానికి ‘విధిక’ పేరుగల చెప్పులు కుట్టే వ్యక్తి కానుకలు సమర్పించినట్లు శాసనాధారం ఉంది. ఇతని తండ్రి ఉపాధ్యాయ. (బౌద్ద భిక్షువుకు ఒక పేరు) వీరిద్దరూ బౌద్ధులు. వైదిక, బౌద్దమతాలు పక్కపక్కనే సాగిన కాలమది. వారు వైదిక మతానుయాయులు. ౩వ శతాబ్ది మధ్యనుంచి ఆంధ్రదేశంలో ఆర్ధిక విప్లవం ఒకటి మొదలైంది. విదేశీ వ్యాపారం దాదాపు అంతమైంది. (రోమన్ సామ్రాజ్యం పతనం ఇందుకు ముఖ్యకారణం) పరిశ్రమలు మూలపడ్డాయి. ఇక్ష్యాకుల రాజధాని విజయపురిలో సైతం ఆనాటి పారిశ్రామిక అవశేషాలు కనపడవు. వ్యవసాయం వైపు దృష్టి మళ్ళింది. వాశిష్ట్టిపుత్ర చాంతమూల అను ఇక్ష్వకురాజు వేలాది నాగళ్ళను, పశువులను రైతులకు దానంచేసినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఆ పిమ్మట కృష్ణానదికి దిగువన ఉన్న పల్నాడు, వెలనాడు ప్రాంతం అంత కంచి పల్లవరాజుల పాలనకు లోనైంది. వారి పేరుతోనే పలనాడు అనే పేరు వచ్చింది. (పల్లవనాడు అని మొదటిపేరు) ఆ రాజులలో ఒకరు ‘కడువెట్టి’ అనే బిరుడుకలవాడు. ‘కడువెట్టి’ అనగా అడవులను నరికివేసినవాడు అని అర్థం. వ్యవసాయాన్ని ప్రోత్...