కథా వాతావరణం వృత్తి స్థలాలను బట్టి రావాలనే విషయం, ఉద్వేగాల స్థాయి కథావసరం నుంచి రూపొందాలనే నియమం చిలకూరి సాహిత్య సృజనలో అంతర్భాగాలు. వైయక్తిక కోణాన్ని నియంత్రిస్తూ, సామూహిక జీవితాన్ని దర్శింపజేయడం గొప్పగా తెలిసిన రచయిత చిలకూరి దేవపుత్ర.
ఇతని రచన కదిలే కెమెరా కాదు, బతుకు తాను నుంచి అవసరం మేరకు కత్తిరించిన ముక్క.
ఎంతో స్నేహంగా సున్నితంగా ప్రేమగా చిరునవ్వుల్ని చిలికించే చిలకూరి దేవపుత్ర- సాహిత్య సృజనను సీరియస్గా తీసుకున్న వ్యక్తి. దళిత కథనీ, దళిత నవలనీ, దళిత మూలాల నుంచి రూపొందించి చూపిన తొలి తరం సృజనకారుల్లో ఆయనది అరుదయిన స్థానం. ఒకరకంగా అసలు సిసలు దళిత కథకూ, నవలకూ దారులు వెయ్యడంలో ముందడుగు వేసిన వ్యక్తి దేవపుత్ర. ఆధిపత్య సంస్కృతినీ, అమలులోని సాహిత్య వాతావరణాన్నీ చీల్చుకుంటూ ప్రత్యా మ్నాయ సాహిత్యం ఎలా ఉంటుందో చూపిన ఈ సాహితీవేత్త మరణం ఇటు దళిత బహుజన సాహిత్యానికీ అటు మొత్తం తెలుగు సాహిత్యానికీ తీరని లోటు.
దళిత వాస్తవికతని సృజనీకరించటంలో దేవపుత్ర సాహిత్యం రెండు దశలుగా కనిపిస్తుంది. దళిత జీవితాన్ని వాస్తవికంగా చిత్రించిన దశ, ఇంకా ముందుకెళ్లి తాత్విక దృక్పథం నుంచి ఆవిష్కరించిన దశ. అనుభవాల్నీ, పరిశీలననూ అనుసరించి సాగింది తొలి దశయితే, దృక్పథ పరిణతితో సాగింది రెండవ దశ. రెండు దశలకూ వర్తించే సాధారణ గుణం దళిత సంస్కృతినీ, దళిత జీవితంలో ఉండే ప్రజాస్వామిక మధురి మల్నీ సహజాతి సహజంగా చిత్రించటం. ఈ పని చేయటంలో వాస్తవికతని రొమాం టిసైజ్ చేయకుండా జాగ్రత్తపడటం. కాల్పనిక కైపుకు లోనుకాకుండా ఉండటం. 1977లో మొదలయిన ‘మానవత్వం’ కథ నుంచి వందకు మించి రాసిన కథల్లో నేరుగా గానీ, నైరూప్యంగా గానీ దళిత వాస్తవికతను చిత్రించాడు. తను రాసిన నాలుగు నవలల్లో మూడు దళిత ఇతివృత్తాన్ని సాహితీకరించినవే.
రాయలసీమ అగ్రకులాల ఫ్యాక్షనిజంలోనూ, రాజకీయ ముఠా తగాదాల్లోనూ చిక్కుకుని బయటికి రాలేని అనివార్యతలో బంధితులై ప్రాణాల్ని కోల్పోతున్న దళితుల జీవితాన్ని గ్రామీణ సమాజపు జీవన నియమాల నేపథ్యం నుంచి చిత్రిస్తాడు దేవపుత్ర. ‘సమిధలు’, ‘ఆయుధం’ ఇలాంటి కథలే. ఏ రక్షణాలేని జనం అన్నీ అమరిన అగ్రకుల యజమానుల్ని రక్షించే క్రమంలో ప్రాణాలొదలటం ఒక ఐరనీ. ఈ ఐరనీని చూపించటమే ఈ కథల విశిష్టత. బాబాసాహెబ్ అంబేడ్కర్ విశ్లేషించినట్టు ‘‘అంటరాని జనం అగ్రకులాలతో సమానమని చాటే ఏ చర్యయినా అగ్రకులాల మానసిక సమతుల్యతను దెబ్బతీస్తుంది. హింసకు ఇది ప్రధాన కారణం.’’ కారంచేడు నుంచి కైర్లాంజీ వరకు నిరూపితమయ్యిందీ, అవుతున్నదీ ఇదే. మహద్ ఉద్యమం ద్వారా అంబేద్కర్ తెలుసుకున్న అనుభవమిది. ‘ఊడలమర్రి’ కథలో ఈ వాస్తవాన్నే చిత్రిస్తాడు రచయిత. గ్రామ ప్రెసిడెంటుగా దళితుడు కుర్చీలో కూర్చొని ప్రమాణ స్వీకారం చెయ్యటం భీమప్ప గారికి సహించలేని అవమానమయ్యింది. ఫలితంగా క్రూరమయిన భౌతిక హింసకు గురవుతాడు గ్రామ దళిత ప్రెసిడెంట్. తలారి పని చేసే తోటి దళితుడు కూడా ఘటనకు కారణాన్ని అంచనా వేస్తాడు. ‘‘భీమప్ప అయ్యంటే ఏందనుకుంటివి? ఈ సుట్టుపక్కల పల్లెల్లో ఆయనంటే ఎంత పేరూ ఏం కతా? అట్లా అయ్య ముందరే కుర్చీలో కుచ్చుంటాడా వాడు? ఆయన పానం ఓర్చుగుం టుందా?’’ ఈ ‘పానం ఓర్చుకోనితనం’ వెనక ఉన్న కుల వ్యవస్థనీ, దాని మానసికతనీ పట్టించటంలో రచయుత సఫలం అయినట్లే.
కులం మనిషిని ఎంత అసహజమయిన ప్రవర్తనకు గురి చేస్తుందో చెప్పేదే ‘ఇరుకు’ కథ. సమయానికి వైద్యాన్ని అందించలేని కారణంగా చచ్చిపోయిన బిడ్డ కోసం తన్నుకొచ్చే ఏడుపును ఆపుకున్న దళిత తల్లి కథ ఇది. ఆస్పత్రిలో డాక్టర్లు తిడతారని ఏడవదు. బస్సులో బిడ్డ శవాన్ని గుర్తించి లాగేస్తారని ఏడవదు. బస్సు దిగి ఊరి పొలిమేర కొచ్చినాక పడీపడీ ఏడుస్తుంది. ‘‘మాల సుబ్బులుకు యేడ్చేందుకు గూడా వీల్లేనంత యిరుకు ప్రపంచమైపోయిందీ లోకం.’’ ఇదీ రచయిత కామెంట్. ఒకపక్క యస్సీ రిజర్వేషన్లను ద్వేషిస్తూనే మరొకపక్క అవే రిజర్వేషన్ సౌకర్యాల కోసం యస్సీలతో పెళ్లి సంబంధాలు పెట్టుకునే అగ్రకులాల ఉచ్చుల్లో తేలిగ్గా దొరికిపొయ్యే దళితుల నిస్సహాయతని చూపేకథ ‘విలోమం’. తండ్రి చెబుతున్నా వినకుండా జీవన్ని పెళ్లి చేసుకున్న రాధ తన భర్త ఎంత దళిత ద్వేషో తెలుసుకుని దిగ్భ్రమ చెందుతుంది. అదే భర్త తమ బిడ్డను స్కూల్లో యస్సీగా నమోదు చేయించాడని తెలిసి మరింతగా కుమిలిపోతుంది.
దళిత జీవితం అగ్ర కులాలతో ఏదో ఒక ఘర్షణకు గురవుతూ ఉండటం దేవపుత్ర కథల్లో గమనిస్తాం. ఘర్షణను ఎంత అనివార్యమైనదిగా చూపుతాడో అక్కడి నుంచి తిరుగుబాటునీ, మిలిటెన్సీనీ దళితుల వైపు నుంచి జరిగినట్లు ఈ రచయిత చూపడు. అగ్రకుల సమాజాన్ని ఎగ్రెసివ్గా ఢీకొని నిలదొక్కుకోగల భౌతిక వాస్తవికత దళితులకు లేదని ఒక దళితుడిగా తన అనుభవాల నుంచి తెలుసుకోగలిగాడు కనుకనే గాలిలో నుంచి ఊడిపడిన పరిష్కారాల్ని అందించలేదు. అందుకే చాలా కథలు ఘర్షణ దగ్గర ఆగిపోతాయి. అయితే అదే సమయంలో ఈ ఘర్షణల సందర్భంలో దళితులు ఏకం కావాలనుకునే స్పృహను రచయిత వ్యక్తం చేస్తాడు.
అధికారం లేకపోయినా సంపద లేకపోయినా అగ్ర కులస్థులకు దళితుల మీద ఆధిపత్యం ఉంటుంది. ఈ ఆధిపత్యం ఇచ్చిన శక్తి నుంచే రెడ్లలోని పేదవాళ్ళు కూడా ఆర్థిక వెసులుబాటున్న దళితులపై చుండూరులో క్రూరంగా దాడిచేసి వాళ్ళను జంతువుల్ని వేటాడినట్లు వేటాడారు. కైర్లాంజిలో జరిగిందీ ఇదే. ఆర్థికతతో నిమిత్తం లేకుండా అగ్ర కులాలకు తరతరాల నుంచీ సంక్రమించిన, సమకూరిన ఈ సాంఘిక బలం, పెత్తనం చిలకూరి దేవపుత్రను విపరీతంగా కదిలించిన సమస్యలు. ‘అద్దంలో చందమామ’ నవల ఈ అంశాన్ని కళాత్మకంగా, శక్తిమంతంగా చిత్రించింది. రెడ్డి, కరణాల వ్యవస్థ భూసంస్కరణల నేపథ్యంలో ఆడిన అమానవ ఆటలో ఛిద్రమయిన దళిత జీవితాల్ని ఈ నవలలో గమనిస్తాం. కాళ్ళిరగ్గొట్టి పరుగెత్తమనే కుల వ్యవస్థలో దళిత ప్రతిభకు చోటు లేదనీ, అందుకు సమాజంలో ఎంతో పరివర్తన అవసరమనీ ‘పంచమం’ నవల చదువరుల్ని ఆలోచింపజేస్తుంది. ఈ నవలలోని హీరో పాత్ర అయిన శివయ్య దళిత వాస్తవికత నుంచీ, పీడన నుంచీ, రోజువారీ జీవిత రచ్చ నుంచీ చైతన్యాన్ని పొంది మార్పువైపుకు తమ సమాజాన్ని నడపాలనుకునే నవతరం దళిత యువతకు ప్రతినిధి. ముఠా రాజకీయాలూ, కక్షల వెనకున్న కుల నియమాలను చూపే నవల ‘కక్షశిల’. ఈ కక్ష‘శిల’ మీద పగిలేది పీడిత కులాల బతుకులేనని ఈ నవల ఆలోచనోద్వేగాల సమతుల్యతతో నిరూపిస్తుంది.
దేవపుత్ర సాహిత్యం--కథలు కావచ్చూ, నవలలు కావచ్చు-- చెప్పా లనుకున్న విషయానికి బతుకు రూపాన్ని కొంతవరకూ ఇస్తుంది. ఆయన ప్రధాన ధోరణి బతుకును చిత్రించుకుంటూ అందులో భాగంగా చెప్పదగిన విషయాన్ని రాబట్టటం. సీమ సాహిత్యంలో గొప్ప రచయితలుగా పేరొందిన అందరూ ఇదే చేశారు. స్వామి, నామిని, రాసానీ, శాంతినారాయణ, సుందర్రాజు, వెంకట కృష్ణ, జిల్లెళ్ళ బాలాజి, బాల కృష్ణమూర్తి, తుమ్మల రామక్రిష్ణ, సుంకోజి దేవేంద్రాచారి-- వీరంతా చేసిందిదే. ఈ పని చేసే క్రమంలో దేవపుత్ర తాను చిత్రిస్తున్న బతుకు పరిధిలో తారసపడే దళిత సంస్కృతిని వర్ణిస్తాడు. దళిత వాడలో జరిగే పండగలూ, పబ్బాలూ, ఆహారపు అలవాట్లూ, జాతరలూ, ఒకరితో ఒకరు వ్యవహరించే తీరూ-- వీటన్నింటినీ దళిత సంస్కృతిలో భాగంగా ఏమేరకు వర్ణన అవసరమో ఆమేరకు వర్ణిస్తాడు. స్వామి గొప్పగా విశ్లేషించినట్టు ‘‘‘అద్దంలో చందమామ’ నవలలో భూమి సమస్యను గురిం చిన కథావస్తువును దళితేతర రచయిత స్వీకరించి ఉంటే, అది అగ్రవర్ణాల పీడన దగ్గరే... ఆర్థిక సమస్యగానో, రాజకీయ సమస్యగానో మిగిలిపోయేది. అది దేవపుత్ర నవల కాబట్టే కథావస్తువు కథనంలోని దళిత కౌటుంబిక, సాంస్కృతిక అంశాలలో పరివ్యాప్తం చెందగలిగింది.’’
దళిత జీవితాన్ని చిత్రిస్తూ పులికంటి లాంటి కొంతమంది సీమ రచయితలు సాధ్యా సాధ్యాలతో నిమిత్తంలేని దళిత తిరుగుబాటునూ, మిలిటెన్సీనీ చూపారు. మరికొంత మంది దళితుల్ని నేల విడిచిన సాయుధ పోరాట యోధులుగా చిత్రించారు. ఈ రొమాంటిక్ ప్రమాదం నుంచీ, ఊహాత్మక వాస్తవికత నుంచీ దేవపుత్ర తన కథల్ని కాపాడుకోగలిగాడు. దళితులు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏఏ పరిస్థితుల్లో ఏం చేసే అవకాశం ఉంది-- ఈ ధోరణితోనే ఆయన కథనం సాగుతుంది. అయితే ఈ క్రమంలో దళిత జీవన విధానంలో ఉండే ప్రజాస్వామ్య సంస్కృతినీ, కపటమూ నైతిక మురికీ అంటని ప్రేమల్ని రచయిత రూపు కట్టాడు. భర్తతో గొడవపడి పట్టణం చేరిన దళిత సీ్త్ర అనుకోకుండా వ్యభిచారపు రొంపిలోకి ఈడ్చబడిన సందర్భంలో భర్త తిరిగి మళ్లీ ఆమెను ఇంటికి తెచ్చుకున్న సన్నివేశంలో దళితవాడ క్రమంగా ఆమెను అక్కున చేర్చుకోవడం చూపుతాడు ఒక నవలలో. మనుషుల్ని అంగీకరించటానికీ, కలుపుకో వటానికీ, నైతికతకు అతీతమయిన జీవన వాస్తవికత, సంస్కృతీ దళిత జీవనంలో సాధారణమని ఈ సంగతి పాఠకులకు అర్థం చేయిస్తుంది.
దేవపుత్ర తన సాహిత్యంలో సృష్టించిన పాత్రలన్నీ నిజ జీవితం నుంచి రావటం వల్ల వాటి పూర్వాపరాలూ, స్వభావాలూ, నడవడి, మనో ధోరణీ రచయితకు అవగా హనలో ఉండటం వల్ల పాత్ర చిత్రణలో గొప్ప సజీవత కనిపిస్తుంది. తన పాత్రల్లో కులాన్నీ ప్రాంతాన్నీ బట్టి బాషా, స్వభావాన్ని బట్టి సంభాషణా, చైతన్య స్థాయిని బట్టి నిర్ణయాలు కనిపిస్తాయి. కథా వాతావరణం వృత్తి స్థలాలను బట్టి రావాలనే విషయం, ఉద్వేగాల స్థాయి కథావసరం నుంచి రూపొందాలనే నియమం చిలకూరి సాహిత్య సృజనలో అంతర్భాగాలు. వైయక్తిక కోణాన్ని నియంత్రిస్తూ సామూహిక జీవితాన్ని దర్శింపజేయడం గొప్పగా తెలిసిన రచయిత చిలకూరి దేవపుత్ర. బతుకు తడిలేకుండా బతుకు సమస్యల్ని చర్చించే మేధో రచయితలకు దేవపుత్ర సాహిత్యాన్ని చదువుకో వాల్సిన అవసరం ఉంది. ఇతని రచన కదిలే కెమెరా కాదు, బతుకు తాను నుంచి అవసరం మేరకు కత్తిరించిన ముక్క.
తన అనుభవాల పట్లా, జన జీవితం పట్లా ప్రేమా, మమేకతా ఉన్న ఈ రచయిత ఈ యాతనామయమయిన బతుకు నుంచీ, దుఃఖం నుంచీ, ఆత్మ గౌరవ లేమి నుంచీ పరిష్కారాల్ని ఇవ్వటానికి వెనకాడలేదు. మార్క్సిస్టు-అంబేద్కరిస్టు తాత్విక సమన్వయం నుంచి భారతీయ వాస్తవికతను విశ్లేషించాడు. కుల నిర్మూలనా పోరాటాలు ఆత్మగౌర వానికే గాక, ఆర్థిక సమానత్వానికీ దారి తీయాలని ఈయన ఆకాంక్షించాడు. రెండు పొంతనలేని దృక్పథాల్ని సమీకరించటానికి ప్రయత్నించినప్పుడు కలిగే గందరగోళం, అస్పష్టతా ఎంతోకొంత మేరకు ఆయన సాహిత్యంలో ఉండటాన్ని పాఠకులు గమని స్తారు. అయితే ఆయన ఎప్పటికప్పుడు తన అవగాహనను మధించుకుంటూ, నూతన త్వాన్ని రాబట్టుకుంటూపోవడానికి ప్రయత్నించాడు. ఈ సానుకూల ధోరణి ఆయన సాహిత్యాన్ని మనతో సజీవంగా ఉంచుతుంది.
Comments
Post a Comment